- Advertisement -
నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓ సర్పంచ్ చుక్కలు చూపించాడు. తన గ్రామంలో పర్యటిస్తూ తనకు ఆహ్వానం ఇవ్వరా.. చెప్పాపెట్టకుండా ఎలా పర్యటిస్తారు అని ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేను గ్రామానికి వస్తే అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే కారుకు అడ్డంపడి కారు ముందు పడుకుని సర్పంచ్ నిరసన తెలిపాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
నల్లగొండ జిల్లాలోని మునుగోడులో సోమవారం ఎంపీ, ఎమ్మెల్యే పర్యటించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మునుగోడు సర్పంచ్ పందుల నర్సింహ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కారుకు అడ్డం పడి నిరసన తెలిపారు. కారును కదలనీయకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ, ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించారు.
ఈ సందర్భంగా ఆ సర్పంచ్ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశాడు. అగ్రవర్ణాలకు ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని దళిత, బడుగు, బలహీన వర్గాలపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించాడు. తాను దళిత సర్పంచ్ కాబట్టే అవమానిస్తున్నాడని ఆరోపించారు.
ఈ వ్యవహారం టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే ఆ సర్పంచ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీనికి టీఆర్ఎస్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఏడాదిగా సర్పంచ్ నర్సింహ్మ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు.