విదేశాంగ విధానం పేరిట.. ఇప్పటికే సుమారు రూ.200 కోట్లు విదేశీ టూర్లకు వెచ్చించి మన ప్రధాని మోడీజీ.. ఇక నుంచి టూర్లు తగ్గించుకోనున్నారు. 2015లో ఏకంగా 26 దేశాలను చుట్టొచ్చారు. పది ఇరవై ఏళ్లుగా మన దేశ నేతలు కన్నెత్తి చూడని కంట్రీలకెళ్లి.. హాయ్ అంటూ పలుకరించి.. అక్కడి వారిని పులకరింపజేశారు.
అందాకా ఎందుకు చివర్లో పాక్ కెళ్లి సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఈ అవకాశం కోసం ఎదుచూస్తున్న హస్తం నేతలు నోరుపెంచారు. మోడీకు ఏకంగా ఎన్ఆర్ఐ పీఎం అంటూ కితాబునిచ్చారు. ఈ లెక్కన రాబోయే నాలుగేళ్లలో ప్రపంచమంతా చుట్టి వస్తారంటూ వ్యంగాస్త్రాలు కూడా విసిరారు.
ఇవన్నీ నచ్చకో లేక ఇకచాలనుకున్నారో.. ఏమో మోడీగారు ఇక పొరుగుదేశాలకు వెళ్లాలంటే ఏదైనా అత్యవసర సదస్సులు సమావేశాలైతే మాత్రమే నంటూ షరతు పెట్టారట. ఇంతకీ 2016 కొత్త ఏడాది.. ఆయన విదేశీ యాత్ర మార్చి నెలాఖరులో వాషింగ్టన్తో ప్రారంభం కానుంది.
తర్వాత జపాన్, చైనా, పాకిస్తాన్, వెనిజులా, లావోస్, అప్గనిస్తాన్ ఇలా కేవలం పది దేశాల లోపు మాత్రమే పర్యటించేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అందులోనూ.. ఈ ఏడాది బెంగాల్ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. బిహార్ దెబ్బ మళ్లీ చవిచూడకూడదనే ఆలోచన కూడా దీనిలో భాగం కావచ్చనేది ప్రతిపక్ష నేతల అంతరంగం.