ఓ వైపు భారత్పై యుద్ధానికి సిద్ధమని భారత్ ను రెచ్చ గొడుతున్న పాక్ …..మరో వైపు తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి తోడు ఇప్పుడు విద్యుత్ కష్టాలు తోడయ్యాయి. చివరకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కనీసం విద్యుత్ బిల్లును కట్టలేని స్థితిలో ఉంది. దీంతో ఆఫీస్ కు విద్యుత్ ను నిలిపివేసేంత స్థాయి వరకు వెళ్లింది.విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ హెచ్చరించింది. రూ.41 లక్షల విద్యుత్ బిల్లు బకాయిపడ్డారని.. వెంటనే చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని పేర్కొంది.
ప్రధాని కార్యాలయానికి నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.. విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఎన్ని నోటీసులు పంపించినా బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టింది ఇమ్రాన్ కార్యాలయం. వారి నిర్లక్ష్యం కారణంగా.. విద్యుత్ ఉత్పత్తిచేస్తున్న ప్రైవేటు సంస్థలకు తాము బిల్లులు చెల్లించలేకపోతున్నట్టు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ పేర్కొంది.
పీఎంవో కార్యాలయం రూ.41 లక్షల బిల్లు చెల్లించకుండా బకాయి పడిందని.. అంతేగాక గత నెలలో చెల్లించాల్సిన రూ.35 లక్షల బకాయిలు అలానే ఉన్నాయని పేర్కొంది. అక్కడ వరుసగా రెండు నెలల కరెంట్ బిల్లులు చెల్లించని పక్షంలో హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ సరఫరా నిలిపేయొచ్చు.