2019 సార్వత్రిక ఎన్నికల బరిలో తన ‘జనసేన’ ఉంటుందన్న విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసాడు. అయితే ఒంటరిగా పోటీ చేస్తారా? లేక తను నమ్మిన బిజెపితో కలుస్తారా? లేదంటే తను మద్దతు తెలిపిన టిడిపితో జత కలుస్తారా? అదీ గాక జగన్ తో చెట్టాపట్టాలేసుకుంటారా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి… జగన్ – పవన్ ల కలయిక కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ప్రస్తుతానికి అది తేలే అంశం కాదు. అయితే పవన్ కళ్యాణ్ బరిలో దిగినా గానీ, మిగతా పార్టీలు ఎంత విశ్వాసంగా ఉన్నాయో తెలియదు గానీ, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. 2019 ఎన్నికలలో ఎవరు వచ్చినా… చివరికి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగినా గానీ, విజయం సాధించడం టిడిపికి ‘కేక్ వాక్’ లాంటిదని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. దీనికి పెద్ద లాజిక్ కూడా చెప్పుకొచ్చారు మంత్రివర్యులు.
2019 ఎన్నికల సమయం వచ్చే పాటికి రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ సగం వరకు పూర్తయ్యి ఉంటాయని, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం, కేంద్ర సంస్థల ఏర్పాటు వంటివి ప్రారంభమై పనులు సాగుతూ ఉంటాయని, ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీ తప్పక గెలవని పరిస్థితి ఏర్పడుతుందన్న భావనలను వ్యక్తపరిచారు. నిజానికి రాష్ట్ర ప్రజల్లో కూడా ఇదే రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంది.
కానీ, గంటా గారు వ్యాఖ్యానించినట్లు… అసలు సగం పనులు ప్రారంభం కావాలంటే తొలి అడుగు పడాలి కదా..! ఆ ముహూర్తం కోసం ప్రజలు వేచిచూస్తున్నారు. ఒక్క సెక్రటేరియట్ నిర్మాణం చేస్తే కుదరదు కదా… రాజధానిలో మొదటి దశలో పేర్కొన్న నిర్మాణ పనులు ప్రారంభమై, కనీసం సగమైనా పూర్తి కావాలి కదా..! అలాగే పోలవరం కూడా..! అదే జరిగితే గంటా వ్యాఖ్యానించినట్లు పవన్ కళ్యాణే కాదు, అందరూ ఏకమై వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోవడం సాధ్యం కాని విషయమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.