పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి పది నిమిషాల ముందే సభకు వచ్చిన మోడీ నేరుగా విపక్షాలున్న వైపు వెళ్లారు. తొలుత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన ఇచ్చిన సలహాను ప్రశంసించిన ఆయన.. గోవా సభలో ఆయన చేసిన ఒక వ్యాఖ్యను ఖర్గే చేసిన సూచన సబబే అన్నట్లుగా మోడీ స్పందించారు. అంతకు ముందు సొంత పార్టీకి చెందిన ఎంపీలతో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
ప్రతిపక్ష పార్టీ ఎంపీల వద్దకు వస్తూ.. నల్లదెబ్బ ఎలా ఉంది? మజా వస్తోందా? అంటూ మోడీ ప్రశ్నించిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఖర్గేతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలోకి వచ్చారు. తన సీట్లో కూర్చోనున్న సమయంలో మోడీకి ఆమె నమస్కరించారు. దీనికి ప్రతిగా నమస్కారం చేసిన మోడీ.. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించగా..అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒకటి ఉంటుందన్న ధోరణిలో సోనియా బదులిచ్చారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ సభాపక్ష నేత బందోపాధ్యాయ దగ్గరకువెళ్లి ఆయన భుజం మీద చేయి వేసి మాట కలిపారు. ఓపక్కఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. మోడీ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. మోడీ మిగిలినఎంపీలతో వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఆయన భుజం మీద చేయి వేసి మరీ మాట్లాడటం గమనార్హం.