పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులకు బాసటగా నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో పని చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని తీపికబురు అందించారు. గురువారం (ఏప్రిల్ 5) ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ను పరిశీలించిన ఎంపీ కవిత తాను గమనించిన విషయాలను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఢిల్లీలో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్కార్డులను ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో వర్తింపచేయాలని తెలంగాణ భవన్ కమిషనర్ అశోక్కుమార్ను కవిత కోరారు. భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న చేనేత వస్త్రాలు, హైదరాబాద్ బిర్యానీ, ఇతర ప్రాంతీయ ఆహార పదార్థాల కోసం ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్ జర్నలిస్ట్ల సంఘం అధ్యక్షుడు ప్రవీన్కుమార్, ప్రధాన కార్యదర్శి పబ్బ సురేశ్బాబు, ఉపాధ్యక్షులు దోమల్ కామరాజు, అశోక్ రెడ్డి, కోశాధికారి భాస్కర్ తదితరులు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఢిల్లీ జర్నలిస్టులకు కవిత హామీ ఇచ్చారు. ఆమె వెంట ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ఉన్నారు.