పార్లమెంట్ సమావేశాల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. తెలుగుదేశం, వైకాపాలు లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు కూడా చర్చకు రాలేదు. గత వారం పలుమార్లు వాయిదాలతో సభ్యుల ఆందోళనలతో అట్టుడుకిన పార్లమెంటు ఉభయ సభల్లో అదే పరిస్థితి కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
ఆందోళనల మధ్య లోక్సభ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు మొదలైన సభ క్షణాల్లోనే 12 గంటల వరకూ వాయిదా పడగా, ఆపై 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పలు పార్టీల సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రయత్నించి విఫలమయ్యారు. సభ ఆర్డర్ లో లేదంటూ, అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ, కుదిరేలా లేదన్న ఆమె, సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకుముందే రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై మొండి వైఖరిని అవలంభిస్తోందని, అందుకే నేడు కూడా చర్చ చేపట్టలేదని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆరోపించారు. తాము మరింతగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. మరో వైపు వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.