తాము స్కామ్ లో ఇరుక్కొని దాన్నుంచి బయటపడటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో తెలుగుదేశం యత్నాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేవిలా ఉండటం గమనించాల్సిన అంశాలవుతున్నాయి.
ఓటుకు నోటు వ్యవహారం గురించి చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో శాంతిభద్రతల అంశం గురించి చర్చ మొదలు పెట్టింది.
దీనిపై గవర్నర్ ను కలిసిoది. హైదరాబాద్ లో శాంతిభద్రతలను గవర్నర్ సొంతం చేసుకోవాలని తెలుగుదేశం కోరుతోంది. అదెలా కుదురుతుంది.. అంటే గవర్నర్ పై కూడా ఎదురుదాడి మొదలు పెట్టింది. ఇప్పుడు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తోంది. ఉన్నఫలంగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో శాంతిభద్రతలు.. ఈ వ్యవహారంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వంటి అంశాలను తెరపైకి తీసుకురావడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది.
అయితే ఈ వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజలను ఇన్ వాల్వ్ చేస్తోంది. అసలు వివాదం కాని అంశమైన హైదరాబాద్ లో శాంతిభద్రతల గురించి తెలుగుదేశం వారు నెత్తినోరు బాదుకొంటున్నారు. దీన్నొక పెద్ద వివాదంగా మారుస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రజలను అవమానిస్తున్నారంటున్నారు. ఈ విధంగా ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుస్తున్నాయి పచ్చచొక్కాలు. మరి ఈ తీరు తెలుగుదేశం పార్టీ పతనానికి దారి తీయదు కదా?