సివిల్ సర్వీస్ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు తమ ప్రతిభ చాటారు. ఈ సారి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 70 మంది ఎంపిక కావడం విశేషం. విశాఖపట్నానికి చెందిన చేకూరి కీర్తి దేశవ్యాప్తంగా 14 ర్యాంకు, తెలుగు వారిలో మొదటి ర్యాంకు సాధించింది. గడచిన ఐదేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈ సారి తెలుగు అభ్యర్ధులు ఎక్కువ మంది ఉత్తీర్ణులవడం విశేషం.
ఈ సారి హైదరాబాద్ కేంద్రంగా 80 మంది అభ్యర్ధులు మొయిన్స్ పరీక్ష రాస్తే వారిలో 70 మంది ఎంపిక కావడం మరో విశేషం. సివిల్స్ అప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) నిబంధనల్లో వచ్చిన మార్పే ఈ ఫలితాలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిబంధనలో ఇంగ్లీషు, లెక్కలపై పట్టుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో పట్టణ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా సివిల్స్ లో ఎంపికయ్యే వారు. కాని ఆ నిబంధనలో వచ్చిన మార్పు కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈసారి ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపికయ్యారు.