ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు ఉంది. అయితే ఎన్నికల ఫలితాలపై అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండు ధీమాగా ఉన్నాయి. వైసీపీ 120 మావే అంటుంటే, టీడీపీ 150 మావే అంటూ ప్రగల్భాలు పలుకుతుంది. ఎవరి ధీమా ఎలా ఉన్నప్పటికి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఎన్నికల ఫలితాలపై ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతు ఎన్నికల జరిగిన తీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు రెండు నెలలు ముందు పసుపు- కుంకుమ పేరిట ఇచ్చిన 10 వేలు ద్వారా టీడీపీ లబ్ది చేకురుతుందని చంద్రబాబు భావిస్తున్నాడని, అయితే ఇది కూడా నిజం కావచ్చని ఆయన తెలిపాడు. పేదవాడికి ఫ్రీగా 10 వేలు ఇస్తే వాళ్లు కృతజ్ఞత చూపిస్తారని, వారికి మోసం చేయడం చేతకాదని అందుకే వాళ్లు అక్కడే ఉండిపోయారని తెలిపారు ఉండవల్లి. ప్రజలు ఓట్లు వేసి ప్రశాంతంగా ఇళ్లల్లో కూర్చున్నారని ,నాయకులు మాత్రమే కొట్లాడుకుంటున్నారని తెలిపారు.
జగన్ తన ఇమేజ్ మీద గెలుస్తాడని భావిస్తున్నాడని అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలని పేర్కొన్నారు ఉండవల్లి. 2014తో పోలిస్తే జగన్లో చాలా పరిణితి చెందాడని. వైఎస్ఆర్ కొడుకుగా జగన్ సీఎం అయితే నాకు చూడలని ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఉండవల్లి.ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని ప్రజలే స్పష్టమైన తీర్పును ఇవ్వలేదని , ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుందని ఎవరు చెప్పిన నమ్మవద్దని తెలిపారు ఉండవల్లి. పవన్ కల్యాణ్ ప్రభంజనం కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమాతం అయిందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు పెట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు ఉండవల్లి.