రాజ్యసభ మాజీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు తన రాజకీయ వ్యవహరా శైలి ని కాస్తంత మార్చినట్టు అర్ధం అవుతోంది. ఇన్నేళ్ళూ తెలంగాణ రాజకీయాలు – స్థానిక ప్రభుత్వం – పరిపాలన మీద విమర్శలు పెట్టిన ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా కృష్ణా జిల్లా బందరు మండలం మీద పడ్డారు.
అక్కడ పార్టి ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటన చేసిన వీ హెచ్ బందరు పోర్టు భూ సేకరణ వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయ స్థాయి కి తీసుకుని వెళతాను అని భరోసా ఇస్తున్నారు. బందరు పోర్టు పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూ దోపిడీని ఎదుర్కొని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీ హనుమంతరావు భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ – వామపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో బందరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామన్నారు.
అభివృద్ధి పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు – కెసిఆర్ భూదోపిడీకి పాల్పడుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు లాక్కునుంటుండగా – నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణం – బందరు పోర్టు పేరుతో వేలాది ఎకరాలు రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రకరకాల జీవోలతో రైతులను మభ్యపెట్టి భూదోపిడీకి పాల్పడుతున్నారని వీహెచ్ విమర్శించారు. 2013 భూసేకరణ చట్టప్రకారమే రైతుల నుండి భూములు తీసుకోవాలని లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హనుమంతరావు హెచ్చరించారు.