గుమ్మడికాయ దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్టుంది ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు. ఇంతకీ విషయం ఏంటంటే ఏపీ ప్రజలకు చెందిన డేటా… ఏపీకి చెందిన విజయవాడో – లేదంటే గుంటూరో – ఇంకా లేదంటే… ఐటీ హబ్గా ఎదురుగుతున్న తిరుపతి – విశాఖలోని సంస్థల్లో కనిపిస్తే… ఓ మోస్తరు అనుమానాలతో సరిపెట్టుకోవచ్చు. అలాంటిది తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఓ గల్లీలో ఉన్న చిన్న గది కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీలో ఏపీ ప్రజలకు చెందిన సమాచారం మొత్తం ఉందంటే… నిజంగానే పెద్ద ఎత్తున అనుమానాలు రావాల్సిందే.. వస్తున్నాయి కూడా.
ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అసలు ఈ కంపెనీ గుట్టు రట్టును చేయాలని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసుల దర్యాప్తు అంటేనే వణికిపోతుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేశ్ పడుతున్న హైరానా చూస్తుంటే… నిజంగానే పెద్ద అనుమానాలే రేకెత్తుతున్నాయి.
హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చంద్రబాబుకు ఉన్నట్టుండి గుర్తుకు వచ్చేసింది. ఏపీ ప్రజల డేటా పొరుగు రాష్ట్రంలోని ఓ కంపెనీలో దొరికితే కేసులు పెట్టాల్సింది పోయి… కేసులెలా పెడతారంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటే… ఈ వ్యవహారం మొత్తం టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తం కాక మానవు.
అయినా అక్కడ దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులను అడ్డుకునేందుకు ఏపీ నుంచి వందలాది మంది పోలీసులను అక్కడికి తరలించడం చూస్తుంటే… తమ అసలు రూపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయాందోళనలే టీడీపీలో కనిపిస్తున్నాయని కూడా చెప్పక తప్పదు.
ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను తమ వద్ద ఉంచుకున్న సంస్థ తమ పార్టీదేనని ఓ వైపు ఒప్పుకుంటూనే… అసలు ఆ సమాచారం ఆ కంపెనీకి ఎలా చేరిందన్న విషయాన్ని దాటవేన్నారు. అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు… తెలంగాణ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలను ప్రచారం చేస్తున్నారు. నిజంగానే చంద్రబాబు లోకేశ్… ఇద్దరూ ఈ కేసు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారన్న వాదనా వినిపిస్తోంది.