రాష్ట్రంలోని 12,918 గ్రామ సర్పంచుల పదవీకాలం రెండు రోజుల్లో ముగియనుంది. మరో ఆరునెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నందున.. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే… ఏదైనా తేడా జరిగితే.. సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే.. ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చిన చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పంచాయతీల్లో పాలన గాడి తప్పకుండా ఉండేందుకు చంద్రబాబు ఎదుట రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇప్పుడున్న సర్పంచులనే ఇన్ఛార్జులుగా నియమించడం, లేదంటే ప్రత్యక అధికారులను నియమించి పాలనను కొనసాగించడం.. ఈ రెండింటిలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యం ఇస్తే.. తమకు వచ్చే ఎన్నికల్లో లాభిస్తుందనే అంశంపై తీవ్రంగా చర్చలు కొనసాగిస్తున్నారు.
సర్పంచుల పదవీకాలం ముగిసే.. ఆగస్టు 02 రోజునే.. తన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశం హైకోర్టుకు చేరింది. తమకే ఇన్ఛార్జిలుగా అవకాశం ఇవ్వాలంటూ.. రాష్ర్టంలోని అనేక గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై గత రెండు రోజులుగా చంద్రబాబు, మంత్రులు చర్చిస్తున్నారు. సర్పంచులను కొనసాగిస్తే.. ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అధికారులకు పాలన అప్పగిస్తే.. ఎలా ఉంటుందనే విషయం లోతుగా దృష్టిసారించారు. వచ్చే ఐదేళ్ల అధికారాన్ని తమకు కట్టబెట్టే నిర్ణయాలలో ఇది అత్యంత కీలకమైనది.. అందుకే ఒకటికి పదిసార్లు ఆఖరి రోజువరకూ దీనిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఎందుకు చేశారని..
పక్కనే ఉన్న తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారి పాలనలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. గ్రామీణ ఓటు బ్యాంకు మొత్తం ఈ పంచాయతీల పరిధిలోనే ఉంది. అధికారాన్ని నిర్ణయించేది కూడా గ్రామీణ ఓటర్ల తీర్పే. నగరాల్లో ఉన్నవారు.. పార్టీ, అభ్యర్థి, బ్యాక్గ్రౌండ్ వంటివన్నీ చూసి.. ఎవరికి బాగుంటే వారికే వేస్తారు. కానీ.. గ్రామీణ ఓటర్లు ఎవరు నిలబడినా, ఏం చేసినా, చేయకపోయినా.. ముందే ఓ పార్టీని నిర్ణయించుకుని ఓట్లు గుద్దేస్తుంటారు. అందుకే.. వీళ్లను సరైన పద్ధతిలో మలచుకునేందుకు.. పంచాయతీ బాధ్యతలు చూసేవాళ్లు.. కీలకమైనవాళ్లు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కేసీఆర్ ఏ లెక్కన అధికారులను పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారనేది సైతం పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..
చంద్రబాబు మాత్రం ఒకే దెబ్బకు ఉన్న వ్యతిరేకతనంతా వదిలించుకోవాలనే కోణంలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. పంచాయతీల్లో ఉన్న సర్పంచులు అధికభాగం అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఉన్నారు. ఐదేళ్లలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ.. వీరిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అధికశాతం మందిపై ఆయా గ్రామాల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. సాధారణంగానే పంచాయతీ సర్పంచుల తీరుపై ఐదేళ్లలో జనం విసిగిపోతూ ఉంటారు. గ్రామంలో జరిగే అభివృద్ధి పనుల నుంచి ప్రతి విషయంలో.. తమ వాటాలు తీసుకోవడం, తమవారికే అన్నింటినీ కట్టబెట్టడం వంటివి ఎక్కువశాతం ఈ ఐదేళ్లలో జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో వీరినే మళ్లీ ఇన్ఛార్జిలుగా కొనసాగిస్తే.. ఇదేతంతు ఎన్నికల వరకూ కొనసాగిస్తారు. అందుకే.. వీరిని తప్పించి ప్రత్యేక అధికారులను నియమిస్తే.. ఆరు నెలల్లో వీరిపై ఉండే వ్యతిరేకతను జనం మరచిపోయేందుకు ఆస్కారం ఉంది. అందుకే.. అధికారులనే నియమించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే.. దీనిపై సర్పంచుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా.. వారికి నచ్చజెప్పి ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను వివరించొచ్చని భావిస్తున్నారు.