వైఎస్ జగన్ మీద కత్తితో దాడి చేసిన సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్మీద ఎవరు దాడి చేయించారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ మీద జరిగిన దాడి….ఇప్పుడు జగన్మీద జరిగిన దాడి రెండూ ఒకే విధంగా ఉన్నాయనే సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది.
9 జనవరి 1984 లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుపై ఇలాంటి దాడే జరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయిన సందర్భంగా దానిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చెయ్యాలని…హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు విప్ వరుసల్లో పెద్ద నాయకులు, మంత్రులు, గవర్నర్, రామారావు గారు, నాదెండ్ల భాస్కర రావు గారు ఆశీనులయ్యారు.
అంతలోనే ఇంతలో సడెన్ గా “ఇందిరాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్” అంటూ అరుపులు వినపడ్డాయి. అందరు తలతిప్పి చూసే లోగానే చిన్నపాటి కత్తితో ఎన్టీఆర్ మీద దాడి చేసాడు. అందరు అతన్ని పట్టుకునే లోపే ఎన్టీఆర్ బొటన వేలుకి గాయం అయింది.
కాంగ్రెస్ వాళ్ళు నన్ను చంపాలని చూసారు, దేముడు కాపాడాడు” అని ఒక ప్రకటన ఇచ్చి తిన్నగా ఇంటికి వెళ్లి, చేతికి చిన్న నిమ్మకాయ ముక్క ఒకటి కట్టుకున్నారు (అక్కడున్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు, హాస్పిటల్ కి వెళ్ళలేదు). తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారి బలవంతం మీద నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకొన్నారు. అప్పట్లో ఈ దాడి ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అప్పటికే నాదెండ్ల, కొత్తగా పార్టీలోకి వచ్చిన చంద్రబాబు మధ్య విభేదాలు ఉండటంతో, నిందితుడుది కూడా గుంటూరు జిల్లా అవ్వటంతో ఈ హత్యాయత్నం వెనక నాదెండ్ల హస్తం కూడా ఉందని కేసు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, పార్టీలో కొంతమంది పెద్దలు దీనికి అంగీకరించకపోవడంతో బాబ్జీ మీదనే కేసు పెట్టి జైలుకు పంపించారు.
ఈ కేసులో స్వయంగా ఎన్టీఆరే కోర్టుకు హాజరయ్యారు. బాబ్జీని క్షమించాలని కోర్టును కోరారు. బాబ్జీ జైలు నుంచి 1985లో బయటికొచ్చాడు. గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్లో తోటమాలిగా పనిచేశాడు. కొన్నాళ్లకు బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో రెండు పేజీల లేఖ దొరికింది. ఎన్టీఆర్పై దాడి చేస్తే 3లక్షలు ఇస్తామన్నారని కానీ 30వేలు మాత్రమే చెల్లించారని ఆ లేఖలో బాబ్జీ పేర్కొనడం గమనార్హం.
బాబ్జీ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రీరాములు కమిషన్ ఆ లేఖలోని అంశాలను బయటపెట్టింది. దాంతో దానికి పుల్స్టాప్ పడింది. ఇప్పుడు జగన్మీద దాడి ఘటనతో ఎన్టీఆర్ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.