ప్రతిపక్షాలనుంచి వచ్చె ఎన్ని సవాల్లనైనా ఎదుర్కోవచ్చు కాని సొంత పార్టీలో ఉన్న చోటుచేసుకుంటున్న ఆధిపత్యరాజకీయాలను పరిస్కరించడం అంతసులభంకాదు. ఇప్పుడు దాదాపు బాబు పరిస్థితి అలాగె తయారయ్యింది. టీడీపీలో నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో బాబు కంటిమీద నిద్రలేకుండా పోతోంది. ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు బాబు.
రాజీనామా బెదిరింపుతో చాగల్లు రిజర్వాయర్కు నాలుగు టీఎంసీల నీటిని ఆఘమేఘాల మీద జేసీ దివాకర్ రెడ్డి విడుదల చేయించుకోవడంతో మరోసారి వివాదం చెలరేగింది. నిజానికి చాగల్లు రిజర్వాయర్కు నీటి కేటాయింపులు అధికారికంగా లేవు. కానీ శింగనమల నియోజకవర్గానికి స్థిరీకరణ నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే శింగనమలకు నీరు ఇవ్వకుండా చాగల్లుకు తరలించడంతో శింగనమల రైతులు భగ్గుమన్నారు. ఏకంగా కలెక్టరేట్ను ముట్టడించారు. బెదిరిస్తే తప్ప నీరు ఇవ్వరా అని నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్నాకు మద్దతుగా ఎమ్మెల్యే యామిని బాల పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు ఆమెను అడ్డుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి నీరు తరలించుకుపోతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆమెను నిలదీశారు.
మరో వైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య ఉన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాను దళిత మహిళను కాబట్టే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని పీతల సుజాత వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్యపోరు కారనంగా 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జెడ్పీ సీఈవోకు సమర్పించారు. మున్ముందు ఈ విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి సొంతపార్టీలో నాయకుల మధ్య ఉన్న విబేధాలపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.