రాజ్యసభ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. అయితే ఈ ఎన్నికల అభ్యర్థుల్లో సీఎం రమేశ్ రెండోసారి ఎంపిక కావడం ఆశ్చర్యమేస్తోంది. చంద్రబాబును ఇరకాటంలో పెట్టి రాజకీయం చేసి మరీ రెండోసారి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సీఎం రమేశ్ దక్కించుకున్నారని సమాచారం. ఇక రెండో అభ్యర్థిగా కనకమేడల రవీంద్రకుమార్ను ఎంపిక చేశారు.
సీఎం రమేశ్ అసలు పేరు చింతకుంట మున్నయ్య రమేశ్. వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. వ్యాపారవేత్తగా సీఎం రమేశ్ గుర్తింపు పొందారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి రమేశ్. రెండోసారి రాజ్యసభ ఎంపిక చేయడం వెనక చాలా రాజకీయ అవసరాలు టీడీపీకి ఉన్నాయి.
ఇక రెండో అభ్యర్థి తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడిగా కనకమేడల రవీంద్రకుమార్ కొనసాగుతున్నారు. వర్ల రామయ్య పేరు వినిపించినా తుది జాబితాకు వచ్చేవరకు పేరు మారింది. సీనియర్ న్యాయవాదిగా రవీంద్రకుమార్ పేరు పొందాడు. పార్టీని నమ్ముకొని ఉంటున్న అతడిని చంద్రబాబునాయుడు రాజ్యసభకు పంపించి న్యాయం చేశాడు.