ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఈ నియోజకవర్గం. ఎందుకంటే పొత్తులో భాగంగా కూటమి తరపున సీఎం రమేశ్ పోటీలో ఉంటే వైసీపీ తరపున డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఎన్నికల బరిలో నిలిచారు. ఎందరో ప్రముఖులు ఈ నియోజక వర్గం నుండి గెలిచి ఎంపీలుగా గెలిచారు. 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.
ఎక్కువసార్లు గెలిచింది కాంగ్రెసే. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా ఈ నియోజకవర్గంలో మొత్తం 13 లక్షల 50 వేల ఓట్లు ఉన్నాయి. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే ఎక్కువ. తొలుత అనకాపల్లి ఎంపీగా పోటీచేయాలని టీడీపీ నుంచి చింతకాయల విజయ్, జనసేన నుంచి నాగబాబు, కొణతాల రామకృష్ణ భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ నేత సీఎం రమేశ్ టికెట్ దక్కించుకుని బరిలో నిలిచారు.
ముత్యాలనాయుడు ..పంచాయతీ వార్డు మెంబర్గా ,సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా గత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు ముత్యాలనాయుడు.
సీఎం రమేశ్ టీడీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత బీజేపీలో చేరారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. తొలుత విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినా చివరకు అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నారు సీఎం రమేశ్. మొత్తంగా లోకల్, నాన్ లోకల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.