ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఈడీ అధికారలు కొరడా ఝులిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ ఎంపీ సీఎమ్ రమేష్ ఇళ్లు, ఆఫీసులపై రైడ్ చేసిన అధికారలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో ఎంపీకి సంబంధించి సంస్థల్లో ఈడీ అధికారులు దాడులు జరిపారు.
నాగార్జున హిల్స్లో ఉన్న కంపెనీలో రెండు రోజులగా సోదాలు చేశారు. స్ప్లెన్ డిడ్ మెటల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలో శుక్రవారం రాత్రి వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. నాగార్జున హిల్స్లోని ఆఫీసులో శుక్రవారం రాత్రి పలు పత్రాలను అధికారులు పరిశీలించి, కీలకమైన డాక్యూమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి షెల్కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే… కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ 2016 లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
గత అక్టోబర్లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్డిస్క్లు, ఫైల్స్తో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. దాదాపు మూడు బ్యాంకుల నుంచి 304కోట్ల రూపాయలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆంధ్రాబ్యాంకు నుంచి 60కోట్లు, కార్పోరేషన్ బ్యాంకు 120, సెంట్రల్బ్యాంకు 124కోట్లు అప్పుగా తీసుకున్నారు. చాలావరకు నిధులను డొల్లకంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ కేసుల విచారణ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది.