తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివురు గప్పిన నిప్పులా ఉంది. తరచూ కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ బస్సు యాత్ర, పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పడేసేలా పరిస్థితి వచ్చింది.
తెలంగాణ పాలనపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. ఢిల్లీలోని పార్లమెంట్ లాబీల్లో గురువారం (ఏప్రిల్ 5) మన్మోహన్సింగ్కు కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు మన్మోహన్సింగ్కు పరిచయం చేశారు. కొత్త ఎంపీలను అభినందించిన మన్మోహన్ సింగ్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకొన్నారు.
దేశంలో అత్యుత్తమ పాలన సాగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోందని ప్రశంసించారు. పిన్నవయసులోనే తెలంగాణలో పరుగులు పెడుతున్న అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొత్త ఎంపీలు.. రాష్ట్ర అభివృద్ధికోణంలో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధే తొలి ప్రాధాన్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీ కేకే మీడియాకు చెప్పారు.
ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు అంతటి పెద్దమనిషి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం గర్వంగా ఉందని కేకే పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేశవరావు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అ న్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.