రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్ని పార్టీలు రంగాన్ని సిద్దం చేసుకుంటున్నాయి. పాయదాత్రలో జగన్ కొన్ని చోట్లు అభ్యర్తులను ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త పార్టీలో వినిపిస్తోంది. పార్టీ తరుపున పోటీ చేయాల్సిన అభ్యర్ధుల జాబితా సిద్దమైందా? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన నివేదిక ప్రకారం అభ్యర్ధుల ఎంపికలో జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు చెబుతున్నాయ్.
నియోజకవర్గాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పుల జాబితా పరిశీలనకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిందట. పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సర్వేల రిపోర్ట్ను జగన్కు అందించారు. ఈ రిపోర్టులపై జగన్కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
అయితే, ఇప్పటికే రెండు విడతలుగా తన సర్వేను పూర్తి చేసిన పికె ప్రాధమికంగా ఓ నివేదికను తయారుచేసి జగన్ కు అందచేశారట. దాని ప్రకారం రాష్ట్రంలోని అన్నీ నియోజవకర్గాల్లోని సామాజిక వర్గాల బలాబలాలపై వివరాలున్నాయట. అంతేకాకుండా ఎంఎల్ఏలతో పాటు సమన్వయకర్తల పనితీరును కూడా వివరించారట. బాగా పనిచేస్తున్న వారు, పనిచేయనివారు అంటూ రెండు రకాల వివరాలు అందచేశారట.
కొన్ని నియోజక వర్గాల్లో సమన్వయకర్తలు సరిగా పనిచేయడంలేదని వారిని వెంటనే తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించారు. దాని ప్రకారమే జగన్ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా జగన్ కు సూచించారట.
పికె నివేదిక ప్రకారం దాదాపు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులపై జగన్ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారట. అందులో భాగంగానే పత్తికొండ, కుప్పం నియోజక వర్గాల అభ్యర్తులను జగన్ ప్రకటించారు. ఇప్పటికే మరికొన్ని నియోజక వర్గాల్లో కూడా అభ్యర్తుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎన్నికలకు వైకాపా పకడ్బందీగా ప్రణాలికలు సిద్దం చేస్తోంది.