ఎన్నికల ముందు చేరికలు, రాజీనామాలతో పార్టీలు బిజిబిజీగా ఉన్నాయి. పార్టీలోకి ఒక ప్రధాన రాజకీయ కుటుంబం ఎంట్రీ ఇస్తే.. మరో కుటుంబానికి పొసగడం లేదు. కర్నూలులో టీడీపీలో చేరిన కోట్ల కుటుంబానికి కేఈ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ పైకి రెండు కుటుంబాలను చంద్రబాబు కలిపారని తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ కర్నూలులో కోట్ల కుటుంబం రాకతో తెలుగుదేశంలో మాత్రం వేడి మొదలైంది.
కొడుమూరు సభలోనే కోట్ల రాకను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం తమ్ముళ్లు నినాదాలు చేశారు. సాక్షాత్తూ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ కార్యకర్త చెప్పు విసిరారు. కోట్లకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇక మరోవైపు కోట్ల ఎంట్రీతో తన ఎంపీ సీటుకు ఎసరు వచ్చిందనుకున్నారో ఏమో… చంద్రబాబు పర్యటనకు ఎంపీ బుట్టా రేణుక డుమ్మా కొట్టారు. ఎంతవరకు నిజమో గానీ ఆమె మళ్లీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని ప్రచారం కూడా జరగుతోంది.
మరోవైపు పాణ్యం సీటు ఆశిస్తున్న ఏరాసు ప్రతాప్రెడ్డి కూడా మీటింగ్కు రాలేదు. ఆయన కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం. ఇటు ఆలూరు టీడీపీ నేత వీరభద్రగౌడ్ కూడా అసంతృప్తితో ఉన్నారు. కొడుమూరు ఇంచార్జ్గా ఉన్న విష్ణు కూడా పార్టీకి రాంరాం చెప్పే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి కోట్ల ఎంట్రీ ఎఫెక్టో లేక మొదటి నుంచి ఉన్న విబేధాలో తెలియదు కానీ… మొత్తానికి కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కోట్ల, కేఈ కుటుంబాలు నిజంగా కలిశాయో లేక… పైకి నటిస్తున్నారో తెలియదు. ఎన్నికలు వస్తే గానీ ఏ వర్గం ఎటు వైపు పనిచేసిందో తెలుస్తుంది. ఏదేమైనా రాయలసీమ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ఉండనున్నదేని కాదనలేని వాస్తవం.