ఏపీలో ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో చాల మార్పులతో పాటు రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చకున్నారు. ఇప్పుడు తాజగా టీడీపీనేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలో చేరారు.వైసీపీ నేతల విజయసాయిరెడ్డితో కలిసి ఈరోజు జగన్ ఇంటికి వెళ్లిన మోదుగుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మోదుగులకు పార్టీ కండువా కప్పిన జగన్.. ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేముందుగానె ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజానామా చేశారు.
పార్టీలో చేరిన అనంతరం మోదుగుల టీడీపీపై విరుచుకు పడ్డారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. పదవులకోసం ఆశించి పార్టీలోకి రాలేదని…జగన్ ఏబాధ్యత అప్పగించినా చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు.
తనపై పోటీ చేస్తే తన సత్తా చూపిస్తానని టీడీపీ నేత గల్లా జయదేవ్ మోదుగలకు సవాల్ విసిరారు. జయదేవ్ వ్యాఖ్యలకు మోదుగుల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గుంటూరుకు జయదేవ్ గెస్ట్ లాంటివారని విమర్శించారు. జయదేవ్ గుంటూరుకు రావడం, పోవడం తప్పితే ఓ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదని దుయ్యబట్టారు.
జగన్ ఆదేశిస్తే గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గల్లా జయదేవ్ పై పోటీచేస్తానని ప్రకటించారు. గల్లా జయదేవ్ చేసే ఆరోపణలు అన్నింటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
2009లో నర్సరావుపేట నుంచి టీడీపీ ఎంపిగా గెలిచిన మోదుగుల 2014లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. గత కొంత కాలంగా టీడీపీలో అసంతప్తిగా ఉన్న ఆయన ఇటీవల రాజీనామా చేశారు. వైసీపీలో చేరేందుకు జగన్తో పలు దఫా చర్చలు జరిపిన అనంతరం వైసీపీలో చేరారు.