వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొత్త పంచాయతీ ప్రారంభమైంది. నిన్న మొన్నటి దాకా మంత్రి ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సాగిన పంచాయతీకి చంద్రబాబు కిందా మీద పడి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఆదినారాయణకు ఎంపీ టికెట్, రామసుబ్బారెడ్డికి టికెట్ కేటాయిస్తానని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చారు. కానీ ఆదినారాయణ రెడ్డి ససేమీరా అనడంతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ స్థానం కూడా ఆది కుటుంబానికే కేటాయిస్తాననడంతో ఈ పంచాయతీకి తెరపడింది.
వివాదం ముగిసింది అనుకునే లోపే ఇప్పుడు ఆదినారాయణ కుటుంబంలో కొత్త ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవి.. ఆది సోదురుడి కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ స్థానాన్ని శంకర్రెడ్డి కుటుంబంలోని ఎవరికైనా కేటాయించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
శంకర్ రెడ్డి ఎవరనేగా ప్రశ్న? గతంలో షాద్నగర్ జంట హత్యల కేసులో ఆది వర్గానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆది బంధువు శంకర్ రెడ్డి ఒకరు. ఈ హత్యలకు కారణం రామసుబ్బారెడ్డి వర్గమేనని సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇప్పుడు ఆ శంకర్రెడ్డి కుటుంబ సభ్యులకే ఎమ్మెల్సీ కేటాయించాలని డిమాండ్.
మొన్న చంద్రబాబు సమక్షంలో జరిగిన రాజీ భేటీలలో ఈ కేసు విషయం కూడా ఉన్నట్టు వినికిడి. రాజీలో భాగంగా శంకర్ రెడ్డి కుటుంబీకులు సుప్రీం కోర్టులో ఉన్న కేసులో రాజీ పడుతున్నట్లు ఒప్పుకోవడం జరిగిందని… ఈ రాజీని చంద్రబాబు దగ్గరుండి చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నారాయణరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి అనుభవించారని, ఆయన కుమారుడు కూడా జడ్పీటీసీగా ఉన్నదని… మళ్లీ వారి కుటుంబసభ్యులకే ఎమ్మెల్సీ ఇవ్వడం సరికాదనే వాదన మొదలైందిప్పుడు. అన్ని పదవులు అన్నదమ్ములకే ఇస్తే… ఇక ఆది వర్గం కోసం పనిచేసి ప్రాణాలు పొగొట్టుకున్న శంకర్ రెడ్డి కుటుంబానికి ఏం న్యాయం చేసినట్లు అవుతుందని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏదేమైనా ఎమ్మెల్సీ సీటు ఆది కుటుంబంలో కొత్త పంచాయతీకి తెరలేపిందనే చెప్పాలి.