ఏపీ రాజకీయాల్లో గెలుపెవరిదా అని ఎదురుచూసే నియోజకవర్గంలో ఒకటి పాయాకర్రావు పేట. ఇక్కడ వైసీపీ నుండి కంబాల జోగులుకు టికెట్ కేటాయించగా టీడీపీ నుండి వంగల పూడి అనిత బరిలో ఉన్నారు. టీడీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న అనిత గత ఎన్నికల్లో కొవ్వూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పాయాకరావు పేట నుండి పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.
టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి పాయకరావు పేట. ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందగా కాంగ్రెస్ నాలుగుసార్లు,రెండు సార్లు వైసీపీ విజయం సాధించాయి. వైసీపీ నుండి వాస్తవానికి గొల్ల బాబూరావు,చెంగల వెంకట్రావు,పెదపాటి అమ్మాజీ టికెట్ కోసం ప్రయత్నించగా చివరకు కంబాల జోగులుకు అవకాశం దక్కింది.
తన రాజకీయ జీవితానికి ముందు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనిత…తన వాగ్దాటితో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఈ సీటును దక్కించుకునేందుకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభకు పంపి.. రాజాంలో రెండుసార్లు గెలిచిన సౌమ్యుడు అన్న పేరున్న కంబాల జోగులును ఇక్కడకు తీసుకువచ్చారు.దీంతో వైసీపీ తరపున టికెట్ ఆశీంచిన నేతలంతా జోగులు గెలుపు కోసం పని చేస్తున్నారు. జోగులుకు కూడా మంచి పేరే ఉంది. ఆయన ఎవ్వరిని నొప్పించరు. పాయకరావుపేట రిజర్వుడు నియోజకవర్గం అయినా ఇక్కడ కాపు సామాజిక వర్గానిదే పొలిటికల్ డామినేషన్. ఇదే తనకు కలిసివస్తుందని జోగులు భావిస్తున్నారు. ఇక అనితకు జనసేన కేడర్కు గ్యాప్ ఉండటంతో ఇది ఖచ్చితంగా టీడీపీ గెలుపుపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పాయకరావుపేట ఓటర్లు ఎవరికి అండగా నిలుస్తారో వేచిచూడాలి.