టీడీపీ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ వద్ద 2017 నవంబరు 6న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో వారితో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
పాదయాత్ర ఇప్పటి వరకు 294 రోజుల్లో 11 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల మీదుగా ఆయన యాత్ర సాగింది. దీనిలో 1739 గ్రామాలు, 205 మండలాలు, 47 పురపాలక సంఘాలు, 8 కార్పోరేషన్ల ప్రజలతో మమేకమయ్యారు. మొత్తం 113 బహిరంగసభలు, 42 చోట్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్సార్ జిల్లాలో ప్రారంభమైన యాత్రను కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్ జగన్ ముగించుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, గృహ నిర్మాణం, 108 వంటి అనేక సంక్షేమ పథకాలకు ఊపిరులూది దేశంలోనే సంక్షేమ విప్లవానికి నాంది పలికిన తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కంటే రెండడుగులు ముందుకు వేయాలనే కృతనిశ్చయంతో ఉన్న జగన్ తన ఆశయాలకు అనుగుణంగా ‘నవరత్నాలు’ను రూపొందించారు. నవరత్నాల పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వేచిచూస్తున్న జగన్పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు జగన్.
గాయం నుంచి కోలుకుంటున్నాను… మీ అందరి తోడుగా.. మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన ’’ అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.