వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తిదాడి ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారణలో భాగంగా వైసీపీ నేతకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
జగన్పై దాడి జరిగిన తర్వాత నిందితుడు శ్రీనివాసరావుకు టీడీపీ సభ్యత్వం ఉందని, అతడు టీడీపీ కార్యకర్త అని జోగి ఆరోపించిన విషయం తెలిసిందే. మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు చూపించారని, దుష్ప్రచారం చేశారంటూ వర్ల రామయ్య అరండల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత జోగి రమేష్పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగి రమేష్ చేసిన ఆరోపణలపై స్పష్టత కోసం విచారణకు కావాలని నోటీసులలో సూచించారు.
పోలీసుల నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జోగిరమేష్. విచారణను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.