కాపులను బిసిల్లోకి చేరుస్తూ శుక్రవారం మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. జస్టిస్ మంజూనాధ కమీషన్ నివేదికను ఆమోదించిన మంత్రివర్గం అదే నివేదికను శనివారం అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. చర్చ అనంతరం కాపు కార్పొరేషన్ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.
కాపులకు 5శాతం కల్పించే బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై బీసీ సంఘాలు బగ్గుమన్నాయి. ఏపీలో రాస్తారోకోలు,ధర్నాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్వహించారు. ఇప్పటికే బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా బీసీ (ఎఫ్) గా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు ఒకడుగు ముందుకేసి కాపులను బీసీల్లో చేర్చితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఈ పోరాటం కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. కాగా, మంజునాథ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా కాపులను బీసీ (ఎఫ్) గా పేర్కొంటూ 5 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే.