తెలంగాణా ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ శాసనసభలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకముందే అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే శాసన మండలి, సభలో విపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడంతోపాటు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పావులు కదుపుతోందని టీఆర్ఎస్.
రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే మండలిలో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిన సంగతి తెలసిందే. ఇప్పడు కాంగ్రెస్, టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలపై టీఆర్ ఎస్ గురి పెట్టింది. టీడీపీ తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అదే జరిగితే తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్టే. అసలు పార్టీనే కనుమరుగయ్యో పరిస్థితిలో ఉంది.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావును టీఆర్ఎస్ లో చేరాలని ఆ పార్టీ నేతలు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలతో సండ్ర వెంకటవీరయ్య సమావేశమై ఈ విషయమై చర్చించినట్టుగా సమచారం.
టీఆర్ఎస్కు చెందిన కీలక నేత ఒకరు సండ్ర వెంకటవీరయ్యతో పాటు మచ్చా నాగేశ్వర్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నుండి వచ్చిన ఆఫర్ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్యులతో సండ్ర వెంకటవీరయ్య భేటీ అయినట్లు తెలుస్తోంది.
తనకు టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని, ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు భోగట్టా. అయితే, సండ్ర ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా మెచ్చా నాగేశ్వరరావు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే, తాను టీడీపీని వీడటంలేదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశారు