రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ మంగళవారం స్వచ్ఛందంగా ఏపీ బంద్లో పాల్గొని విజయవంతం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రజల ఆకాంక్ష అని, ఆ ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ ఈ బంద్ ను అణచివేయాలని చూసిందని విమర్శించారు.
బంద్ను నీరుగార్చేందుకు, బలవంతంగా ఆర్టీసీ బస్సులను సైతం తిప్పడానికి చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. హోదా కోసం ముందుకొచ్చి ఎంపీలతో రాజీనామాలు చేయించి దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేసి, మీరే బంద్లో పాల్గొనాల్సింది పోయి మీరు చేసే నిర్వాకం ఇదా అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు.
హోదా కోసం నిరసనలు తెలుపుతున్న వారిని కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటు వెళ్లారని, లాఠీ చార్జ్లు జరిపారని, మహిళలను అని కూడా చూడకుండా పురుష పోలీసులు వారిని నిర్భందించారని, విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్తున్న ఫొటోలను వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులకు చూపించారు. వంద తప్పుల తర్వాత శిశుపాలుడికి కూడా శిక్ష తప్పదన్నట్లుగా చంద్రబాబు కూడా కచ్చితంగా శిక్ష పడి తీరుందన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలుగా మనం అందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాటం ఇక్కడితో ఆగదని, దాన్ని సాధించే వరకూ ఒత్తిడిని కొనసాగిస్తామని వెల్లడించారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ముందుకు రావాలని కోరారు. భావితరాలు బాబును చరిత్ర హీనుడిగా చూస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు.
బంద్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న టీడీపీ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. భారతదేశం చేసుకున్న ఒక అదృష్టం అయ్యా. నువ్వు గనుక అప్పట్లో ఉండివుంటే ఎందుకయ్యా స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు బాగానే పాలిస్తున్నారు కదా. ఒక ప్యాకేజి తీసుకుని సర్దుకుపోదామని చెప్పివుండే వాడివయ్యా అని చంద్రబాబుకు చెప్పాలి.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్త శుద్ధితో పోరాడుతోందన్నారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడతాడు. గంటకో వేషం వేస్తాడు. ఎన్నికలకు ముందు హోదా 10 కాదు 15 ఏళ్లు తెస్తానంటాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలు హోదా వల్ల ఏం బాగుపడ్డాయని ప్రశ్నిస్తాడు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతూ అదే పార్టీకి చెందిన నాయకుడి భార్యకు టీటీడీలో బోర్డు మెంబర్గా పదవి ఇస్తాడు.
బుట్టాయిగూడెంలో జరిగిన బంద్ లో పాల్గొన్న వైసీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందాడు. వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి ఈ బంద్ లో దుర్గారావు పాల్గొన్నాడు. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి దుర్గారావును తరలిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటన నేపథ్యంలో జగన్ స్పందిస్తూ.. దుర్గారావు గుండెపోటుతో చనిపోయాడని, అతని మృతికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు
.