ఏపీలో ఎన్నికల పండగ మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ వర్ధంతి సందర్బంగా పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.
ఇందుకోసం ఒక నెంబర్ కూడా ఇచ్చారు. 91210 91210 నెంబర్ను ఇందుకు కేటాయించారు. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే తన కార్యాలయం నుంచే ఫోన్ కాల్ వస్తుందని జగన్ చెప్పారు. ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చన్నారు. అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామన్నారు.
కోటి కొత్త కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఇష్టానుసారంగా డబ్బులు పంచారు కాబట్టే ఉప ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేసినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోయినా టీడీపీ అభ్యర్థికి ఓట్లు పడ్డాయంటే అందుకు కారణం ప్రజలను టీడీపీ బెదిరించడమేనని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ వైసీపీలో చేర్చాలని జగన్ పిలుపునిచ్చారు. అనంతరం 6 నెలల పాటు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రజల దీవెనలు కావాలని చెప్పారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఒక్కటి కావాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగి పోవాలని వ్యాఖ్యానించారు.