ప్రపంచీకరణ నేపథ్యంలో అడవులు శాతం రాను రాను తగ్గిపోతోంది. దీనికితోడు గ్లోబుల్ వార్మింగ్ ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. ఇప్పటికే అనేక జీవజాతులు అంతరించిపోయాయి. మరొ కొన్ని అంతరించిపోయో ప్రమాదంలో ఉన్నాయి. అరుదైన అంతిరించిపోతున్న జంతుజాతులను కాపాడుకొనేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
మన దేశంలో హిమాలయాల్లో ఉండే మంచు చిరుతలు కూడా అంతరించిపోయో ప్రమాదంలో ఉన్నాయి. కాలుష్య ప్రభావం పెరిగిపోవడంతో వాటి సంతతి తగ్గిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు చిరుతలు పదివేల మాత్రమే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు మంచు చిరుతలు ఉన్నాయి. వీటిని కాపాడుకొనేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొద్ది కాలం క్రితం వరకూ స్పిటీ వ్యాలీలో మంచు చిరుతలు అరుదుగా కనిపించేవి. ఒకానొక దశలో వీటి జాడ లేకపోవడంతో.. అవి అంతరించి పోయాయని భావించారు. కానీ హిమగిరుల్లో అమర్చిన కెమెరాల్లో వీటి కదలికలు లభ్యమయ్యాయి. మంచు చిరుత పిల్లలు కూడా కనిపించడాన్ని బట్టి వీటి సంతతి పెరుగుతోందని భావించొచ్చని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.
మంచు చిరుతల జనాభాను లెక్కించడానికి అటవీ శాఖ నేషనల్ కన్జర్వేషన్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయో తేల్చడం కోసం వచ్చే మూడేళ్లలో ఈ ఫౌండేషన్ శాస్త్రీయంగా సర్వే చేపట్టనుంది. వాటిని కాపాడుకొనేందుకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది.