ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత బ్యాట్స్మెన్ల ధాటికి లంక బౌలర్లు విలవిల్లాడారు. విజయ్, కోహ్లి శతకాలతో రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 371 పరుగులు చేసింది. దీంతో భారత్ పటిష్ట స్థితిలో ఉంది.
కెప్టెన్ విరాట్ కోహ్లి (186 బంతుల్లో 156 నాటౌట్; 16×4), రోహిత్ శర్మ (6) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 42 పరుగులు జోడించాక చెత్త షాట్ ఆడిన ధావన్ (23) పదో ఓవర్ చివరి బంతికి వికెట్ అవుటయ్యాడు. పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 23 పరుగుల వద్ద గామేజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
ధావన్, పుజారా అవుటయ్యాక క్రీజులోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లి విజయ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే తరహాలో ఆడిన కోహ్లి 52 బంతుల్లోనే 51 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో రెండు సందర్బాల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్లో తొలి రెండు టెస్టుల్లో కోహ్లి (తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో104 నాటౌట్, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 213పరుగులు) రెండు శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.
మరో ఎండ్లో నిలకడగా ఆడిన విజయ్ లంకపై వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం తర్వాత విరాట్ కూడా సెంచరీ సాధించాడు. 110 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన విరాట్కు టెస్టుల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. మరో ఐదు ఓవర్లలో ఆట ముగుస్తుందనగా 155 పరుగుల వద్ద సందకన్ బౌలింగ్లో విజయ్ వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్కు కోహ్లి, విజయ్ నెలకొల్పిన 283 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన రహానే (1)ను కూడా సందకన్ పెవిలియన్ చేర్చాడు. చివర్లో కోహ్లికి రోహిత్ శర్మ జత కలవడంతో భారత్ 371/4 వద్ద తొలి రోజును ముగించింది. ఆట ముగిసే సమయానికి కోహ్లి(156 బ్యాటింగ్)కు జతగా రోహిత్ శర్మ(6 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు.