వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమై శ్రీలంక-ఇండియా మొదటి టెస్ట్ సిరీస్లో మొదటిరోజు శ్రీలంక పైచేయి సాధించింది. టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకున్న లంక ఆదిలోనె భారత్ను దెబ్బతీసింది. బ్యాంటింగ్కు దిగిన కోహ్లీ సేన 17 పరుగులు చేసి మూడు వెకెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌటయ్యారు. రాహుల్ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటయి ‘గోల్డెన్ డక్’గా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన కోహ్లి పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ 11 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరు ముగ్గురిని లక్మల్ అవుట్ చేయడం విశేషం.
తొలి రోజు ఆట పట్టుమని గంట సేపు కూడా సజావుగా సాగలేదు. విరామాల మధ్యే అంచెలంచెలుగా మ్యాచ్ నిర్వహించారు. 8.2 ఓవర్ల వద్ద వర్షం, వెలుతురు లేమి సమస్య కారణంగా కొద్దిసేపు మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభించినా వెలుతురు లేమి సమస్య వెంటాడుతూనే ఉంది. 12వ ఓవర్లో లాహిరు గమేజ్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొనేందుకు పుజారా ఇబ్బంది పడ్డాడు. బంతి సరిగా కనిపించడంలేదని అంపైర్లకు తెలిపాడు. దీంతో వారు మ్యాచ్ను నిలిపివేశారు. సాయంత్రం 4.20 గంటలకు వెలుతురు సమస్య కారణంగా 11.5 ఓవర్ల వద్ద తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. క్రీజులో పుజారా(8), రహానె ఉన్నారు.