మళ్లీ అదే తడబాటు. తొలి టెస్టులో చేసిన పొరపాట్లే పునరావృతం. కానీ ఒక్కడు నిలిచాడు. సారథి అంటే ముందుండి నడిపించేవాడని నిరూపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎక్కడా తడబడకుండా దూకుడుగా ఆడుతూ ఇరుజట్ల స్కోర్ల వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి గనక ఈ స్థాయిలో ఆడకుంటే భారత్ ఈపాటికే చాప చుట్టేసేది. కానీ కోహ్లీ వీరోచిత పోరాటంతో దక్షిణాఫ్రికాకు భారత్ గట్టి పోటీనివ్వకపోయినా బాధ్యతాయుతమైన స్కోరు సాధిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన టీమ్ ఇండియా రెండో టెస్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచు మొదటి ఇన్నింగ్స్లో శతకం బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనంతరం కూడా తన జోరుని కొనసాగించి మరో 41 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్ మెన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కడుతున్నా కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మురళీ విజయ్ 46, లోకేశ్ రాహుల్ 10, చటేశ్వర పుజారా 0 (రనౌట్), రోహిత్ శర్మ 10, పార్థివ్ పటేల్ 19, హార్థిక్ పాండ్యా (రనౌట్) 15 పరుగులు చేసిన అవుటయిన విషయం తెలిసిందే. అనంతరం కోహ్లీకి రవిచంద్రన్ అశ్విన్ చక్కని సహకారం అందించి 38 పరుగుల వద్ద ఔటయ్యాడు.
అశ్విన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన షమీ ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. క్రీజులో కోహ్లీ151 పరుగులు, ఇషాంత్ శర్మ1 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కెల్ రెండు వికెట్లు తీయగా కేశవ్ మహరాజ్, రబాడా, గిడి లకు తలో వికెట్ దక్కాయి. ప్రస్తుతం స్కోరు 303/8 (89ఓవర్లకి)గా ఉంది.
భారత్ చేతిలో ఇక రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో ఇప్పుడు భారమంతా కోహ్లీపైనే ఉంది. దక్షిణాఫ్రికాపై ఆధిక్యం సాధించకపోయినా కనీసం స్కోరును సమం చేస్తే రెండో ఇన్నింగ్స్లో భారత్ కాస్త ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. లేదంటే తొలి టెస్టు ఫలితమే మళ్లీ రెండో టెస్టులోనూ పునరావృతం కావొచ్చు.