భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కళ్లుచెదిరే రీతిలో క్యాచ్లు అందుకోవడం, మెరుపు వేగంతో స్టంపింగ్లు చేయడమే కాదు.. డీఆర్ఎస్ కోరడంలోనూ ధోనీ మార్క్ ఉంటుంది. అందుకే కెప్టెన్ విరాట్ కోహ్లి.. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా ధోనీ సూచనలేనిదే వన్డే, టీ20ల్లో డీఆర్ఎస్ కోరడు. ఈ విషయం దక్షిణాఫ్రికాతో గత శనివారం రాత్రి ముగిసిన నాలుగో వన్డేలో మరోసారి నిరూపితమైంది.
ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో హసీమ్ ఆమ్లా బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని బ్యాట్కి అత్యంత సమీపం నుంచి వెనక్కి వెళ్లింది. దీంతో.. బంతి అందుకున్న ధోనీతో పాటు భారత ఫీల్డర్లు క్యాచ్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ని తిరస్కరించాడు.
కాకపోతే రోహిత్ శర్మ రివ్యూకు వెళదామంటూ కెప్టెన్ కోహ్లికి సంకేతాలిచ్చాడు. దాంతో వెంటనే రివ్యూ వద్దని ధోని అడ్డంగా తల ఊపడంతో ఇక కోహ్లి ముందుకు వెళ్లలేదు. అయితే దాదాపు ఎక్కువ శాతం మంది భారత ఆటగాళ్లు కూడా ఇన్సైడ్ ఎడ్జ్ తాకిందనే భావించారు. కాకపోతే ఇక్కడ ధోని సక్సెస్ అయ్యాడు.