శ్రీలంకతో ఫిరోజ్షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారీ స్కోరు దిశగా వెల్తున్న లంక ఒక్క సారిగా తడబడింది. సోమవారం మూడో రోజు ఆటలో తొలి రెండు సెషన్లపాటు పరీక్షగా నిలిచిన లంక జట్టు.. టీ విరామం తరువాత భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది.
లంక సారథొక్కడే నిలిచాడు. అతనికి మరో సీనియర్ తోడయ్యాడు. కోట్లా కొట్లాటలో మూడో రోజు, సోమవారం పూర్తిగా శ్రీలంకదే ఆధిపత్యం. దినేశ్ చండిమాల్ (147 బ్యాటింగ్: 341 బంతుల్లో 18×4, 1×6) తన బ్యాటింగ్ సత్తా ఏంటో బయటపెట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత మూడంకెల స్కోరు చేశాడు. అతనికి ఏంజెలో మాథ్యూస్ (111; 268 బంతుల్లో 14×4, 2×6) అండగా నిలవడంతో భారత బౌలర్లు కడదాకా చెమడోట్చారు. చివర్లో వికెట్లు పడగొట్టారు కాబట్టి ఆ జట్టు 356/9తో 180 పరుగుల లోటుతో నిలిచింది. లేదంటే మరింత స్కోరు చేసేది.
మాథ్యూస్, చండీమాల్ భాగస్వామ్యాన్ని విడగొట్టడంతో లంక ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెల్లింది. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ప్రధానంగా ఆఖరి సెషన్లో లంక జట్టు ఐదు వికెట్లను కోల్పోవడం భారత బౌలర్ల విజృంభణకు అద్దం పడుతోంది. ఆట ముగిసేసమయానికి లంక కెప్టెన్ చండిమాల్(147 బ్యాటింగ్), సండాకన్(0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.
భారత్-శ్రీలంక చివరి టెస్టు మూడో రోజు ఆట అనేక మలుపులు తిరిగింది. లంకేయుల కడదాకా నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది. సోమవారం ఓవర్నైట్ స్కోరు 131/3తో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక మ్యాచ్ ముగిసే సమయానికి 130 ఓవర్లకు 356/9తో నిలిచింది. సారథి దినేశ్ చండిమాల్, సీనియర్ ఏంజెలో మాథ్యూస్ తమ బ్యాట్లకు పదును పెట్టడంతో భారత బౌలర్లు చెమటోడ్చక తప్పలేదు.
తేనీటి విరామం తర్వాత చండిమాల్ 231 బంతుల్లో శతకం సాధించాడు. అతను సమరవీర (42; 54 బంతుల్లో 9×4)తో కలిసి దీటుగా ఆడాడు. ఐదో వికెట్కు 61 పరుగుల విలువైన భాగస్వామ్యం సాధించాడు. ఐతే జట్టు స్కోరు 317 వద్ద 116.4వ బంతికి సమరవీరను ఇషాంత్ ఔట్ చేశాడు. ఈ క్యాచ్ను కీపర్ వృద్ధిమాన్ సాహా ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఈ తరుణంలోనే అశ్విన్ రంగ ప్రవేశం చేయడంతో శ్రీలంక వెనువెంటనే మూడు వికెట్లు చేజార్చుకుంది.
రోషన్ సిల్వా (0), నిరోషన్ డిక్వెలా (0), సురంగ లక్మల్ (5)… 17 బంతుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. జడేజా 126.5వ బంతికి గమగె (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక 9వ వికెట్ పోగొట్టుకుంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, జడేజా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. ఇంకా శ్రీలంక 180 పరుగుల వెనకబడి ఉంది.