భారత్-శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. మూడో టెస్టు అనంతరం శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వహించనున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తరువాత విరాట్ కోహ్లీకి కాస్త విరామం ఇవ్వాలని జట్టు సెలక్టర్లు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీలంకతో జరిగే టీ-20 సిరీస్కి కూడా కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తాడని సెలెక్టర్లు ప్రకటన చేశారు. తమకు అసలు విరామం ఇవ్వడం లేదని, వరుసగా ఒక సిరీస్ తరువాత మరోటి ఆడుతూనే ఉన్నామని విరాట్ కోహ్లీ ఇటీవలే మండిపడ్డ విషయం తెలిసిందే.
లంకతో మూడు ఫార్మాట్ల సిరీస్లు ముగిసిన అతి స్వల్ప విరామంలో పటిష్ట దక్షిణాఫ్రికాను వారి గడ్డపై ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కాస్త విరామం ఇవ్వాలని, గజిబిజి వరుస షెడ్యూళ్లతో ఆటగాళ్లకే కాదు జట్టుకు నష్టమేనంటూ కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్యలను మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీలు సమర్థించారు. ఈ క్రమంలోలంకతో మూడు వన్డేల సిరీస్కు 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ చీఫ్ సెలక్టర్లు సోమవారం విడుదల చేశారు. టీ20 సిరీస్కు కోహ్లీ అందుబాటులోకి వస్తాడు.
వన్డేసిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా, యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్.