దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి (160 నాటౌట్: 159 బంతుల్లో 12×4, 2×6) భారీ శతకంతో మెరిశాడు. వకెట్లు పడుతున్నా తన పోరాటాన్ని ఆపలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగు తీస్తుండగా కండరాలు పట్టేయడంతో ఇబ్బండిపడిన కోహ్లి.. పరుగు మాత్రం ఆపలేదు.
మ్యాచ్లో అతను మొత్తం 160 పరుగులు చేస్తే అందులో బౌండరీలు ద్వారా వచ్చినవి 60 పరుగులు కాగా.. మిగతా 100 పరుగులూ వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారా రావడం విశేషం. కోహ్లి శతకానికి తోడు ఓపెనర్ శిఖర్ ధావన్ (76: 63 బంతుల్లో 12×4) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 179 పరుగులకే కుప్పకూలిపోయింది.
మ్యాచ్లో పరుగు తీస్తుండగా కండరాలు పట్టేశాయి. కానీ.. జట్టు మెరుగైన స్కోరు సాధించాలంటే చివరి వరకూ ఎవరో ఒకరు బ్యాటింగ్ చేయాలి. కెప్టెన్గా ఆ బాధ్యతని నేనే తీసుకుని జట్టు స్కోరును 300+ దాటించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాలుగో వన్డేలో ఇదే తరహా ఆటని కొనసాగిస్తాం. సిరీస్ని చేజార్చుకోం’ అని విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. వన్డేల్లో వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారా 100 పరుగులు సాధించిన తొలి భారత బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లి రికార్డుల్లో నిలిచాడు.
మ్యాచ్లో ఎక్కడా బౌండరీల కోసం బలవంతపు దూకుడుకు ప్రయత్నించలేదు. ఫోర్లు, సిక్సర్లకంటే వికెట్ల మధ్య పరుగెత్తడాన్నే కోహ్లి ఎక్కువగా ప్రేమిస్తాడని అనిపిస్తుంది ఈ ఇన్నింగ్స్ చూస్తే. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చూపించకుండానే కేవలం సింగిల్స్ ద్వారా వంద పరుగులు చేయడం అనితర సాధ్యం. మధ్యలో ఒక దశలో 45 బంతుల పాటు కోహ్లి ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఏం పర్లేదు…క్రీజ్లో ఉంటే చాలు తర్వాత చూసుకోవచ్చులే అనే ధీమా అతనిది. సరిగ్గా అదే జరిగింది కూడా. తనదైన శైలిలో లెక్క సరి చేస్తూ ఇన్నింగ్స్ ముగిసేసరికి అతను 100కంటే ఎక్కువ స్ట్రైక్రేట్తో ఇన్నింగ్స్ ముగించడం విశేషం. సెంచరీ పూర్తి చేసుకునే సమయానికి 7 ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లి…ఆ తర్వాత మరో 5 ఫోర్లు కొట్టాడు. ఈ జోరు ఇలాగే సాగితే అసలు కోహ్లి పరుగుల వరద ఎక్కడ ఆగుతుందో ఊహకు కూడా అందడం లేదు.