దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల భారత్తో జరిగిన సుదీర్ఘ సిరీస్లో పదునైన బౌన్సర్లతో మెప్పించిన ఈ పేసర్.. మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ తనకి చివరిదంటూ సోమవారం వెల్లడించాడు.
2006లో భారత్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన మోర్నీ మోర్కెల్.. అనతికాలంలో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్లను ఈ పేసర్ ఆడాడు. మార్చి 1 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది.
రిటైర్మెంట్ గురించి మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్లో చాలా కఠినమైన నిర్ణయం. కానీ.. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు.. ఇదే తగిన సమయమని నేను భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని నేను కోరుకుంటున్నాను. ఎడతెరపిలేని షెడ్యూల్, మ్యాచ్లు కూడా నాపై పనిభారాన్ని పెంచుతోందన్నారు. దీంతో జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు.
దక్షిణాఫ్రికా తరఫున ఆడటాన్ని చాలా ఆస్వాదించా. సుదీర్ఘకాలం నాకు అండగా నిలిచిన సహచరులు, ఫ్యామిలీ, ఫ్రెండ్కి ధన్యవాదాలు. నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నాకు తెలుసు. దక్షిణాఫ్రికాకు ఆడిన ప్రతి క్షణాన్ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పాడు. తనలో మిగిలి ఉన్న శక్తిని ఆస్ట్రేలియా సిరీస్ లో ఉపయోగిస్తానని… జట్టుకు విజయాన్ని కట్టబెట్టాలని అనుకుంటున్నానని ఉద్వేగంగా తెలిపాడు.