ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలనం జరిగిన రోజు అది. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను కసితీరా ఓడించిన రోజు. భారత మాజీ స్పిన్నర్ కుంబ్లే జీవితంలో మరిచిపోలేని రోజు. తన స్పిన్తో దాయాది దేశాన్ని చాపచుట్టేసినట్లు చుట్టేశాడు. క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. ఆ మరుపురాని ఘటనకు నేటితో 19ఏళ్లు నిండాయి.
అది 1999 ఫిబ్రవరి 7వ తేది.. ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల మైదానం.. పాకిస్థాన్తో టెస్ట్ మ్యాచ్.. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ బరిలోకి దిగింది. కానీ ఒక బౌలర్ పాక్ బ్యాట్స్మెన్ను శాసించాడు. పదికి 10 వికెట్లు పడగొట్టి భారత్ను గెలిపించాడు. ఆయనే భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే. టెస్టు క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తరవాత ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా చరిత్రకెక్కాడు. తన రికార్డును చిరకాలం నిలిచిపోయేలా చేశాడు.
1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు రెండు టెస్టుల్లో తలపడింది. జనవరి 28 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్లో 172కే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లండ్కు చెందిన జిమ్ లాకెర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన 4వటెస్టు మ్యాచ్లో పదివికెట్లు తీశాడు. ఆయన తర్వాత ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన ఆటగాడు అనిల్ కుంబ్లేనే. ఈ మ్యాచ్లో కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్ చేయగా ఇందులో 9ఓవర్లు మెయిడెన్లు ఉన్నాయి. 74 పరుగులు ఇచ్చి 10వికెట్లు తీసి పాకిస్తాన్ వెన్నువిరిచాడు. ఈ మ్యాచ్లో 207 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. భారత్ 212 పరుగులతో భారీ విజయం సాధించింది.