ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఆదరగొడుతోంది. ఆదిలోనె రెండు వికెట్లు కోల్పోయిన జట్టును మురళీ విజయ్, విరాట్ కోహ్లి ఆదుకున్నారు. ఇద్దరు శతకాలు చేయడంతో భారత్ భారీ స్కోరుదిశగా దూసుకుపోతోంది.
నాగ్పూర్ టెస్టులో శతకం చేసిన విజయ్.. లంకపై వరుసగా రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో విజయ్కు ఇది పదకొండో శతకం కావడం గమనార్హం. సందకన్ బౌలింగ్ బౌండరీ బాదిన విజయ్.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత కోహ్లి కూడా సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. వేగంగా పరుగులు రాబట్టిన విరాట్ 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే ధావన్, పుజారా త్వరగా అవుట్ అయ్యారు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన విరాట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. వన్డే తరహా ఆటతీరుతో బౌండరీలతో చెలరేగిన కోహ్లి లంకపై వరుసగా మూడో శతకం సాధించాడు. కోల్కతా టెస్టులో సెంచరీ సాధించిన విరాట్, నాగ్పూర్లో డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
సొంత గడ్డ మీద దూకుడుగా ఆడిన కోహ్లి 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఊపులో టెస్టుల్లో 20వ సెంచరీ చేశాడు. ఈ ఏడాది కోహ్లికి ఇది 11వ సెంచరీ కాగా, ఓవరాల్గా 52వ శతకం కావడం విశేషం. ఢిల్లీలో కోహ్లికి ఇది మూడో టెస్టు కాగా, తొలి సెంచరీ కావడం గమనార్హం.
భారత్ ఓ దశలో 72 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (23), ఛటేశ్వర్ పుజారా (23) త్వరగా పెవిలియన్ చేరి నిరాశ పర్చారు. కానీ మురళీ విజయ్, విరాట్ కోహ్లి శతకాలతో చెలరేగడంతో ఢిల్లీ టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 64 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.