ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు అభినందించనవాళ్లే.. ఓడినప్పుడు నిందలు వేస్తుంటారు. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లైనా, మాజీలైనా వాళ్లే తీరే వేరు. టీమిండియా చేతిలో ఓటమి తట్టుకోలేక.. మన జట్టు ఓడినా! విజయం సాధించినా..! దాని వెనుక ఏదో కుట్ర ఉందనే కోణంలో విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం పరిపాటిగా మారింది.
తమ జట్టు సెమీస్కు చేరకుండా అడ్డుకొనే ఉద్దేశంతో శ్రీలంక, బంగ్లాదేశ్లతో జరగనున్న మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోనుందని బాసిత్ అలీ ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్తో మ్యాచ్లో భారత జట్టు కావాలనే పేలవంగా ఆడిందని, భారత్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ వార్నర్ చెత్త బ్యాటింగ్ కూడా కుట్రలో భాగమేనని బాసిత్ అలీ ఆరోపించాడు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో పాక్ జట్టు సెమీ ఫైనల్కు రాకూడదని కోహ్లీ సేన కోరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 1992లో సెమీఫైనల్ తమ దేశంలోనే ఆడేందుకు లీగ్ మ్యాచ్లో పాక్తో న్యూజిలాండ్ కావాలనే ఓడిపోయిందని గతంలో జరిగిన మ్యాచ్పైనా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక బసిత్ అలీ పాకిస్తాన్ తరపున 19 టెస్ట్లు, 50 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలపై ఇరుదేశాల అభిమానులు మండిపడుతున్నారు. బసిత్ అలీది మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన బుద్ది కదా.. ఇలానే ఆలోచిస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్థంలేని మాటలతో విలువ తగ్గించుకోకంటూ చురకలంటిస్తున్నారు.