ఏపీ ఎన్నికలు అనగానే ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి రాయలసీమపైనే ఉంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు ప్రధానంగా కడపపైనే దృష్టిసారించాయి. ఇక టీడీపీ తరపున కడప జిల్లాలో జమ్మలమడుగు,మైదకూరు,కమలాపురం స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి,జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి ఈ సారి ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికేఈ ముగ్గురు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను కలుస్తూ వారిలో ధైర్యం నింపుతున్నారు. అయితే వీరికి అధికార వైసీపీ నుండి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. ఎందుకంటే కడప జిల్లా వైసీపీ కంచుకోట. బలమైన ఓటు బ్యాంకుకు తోడు జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మెజార్టీ ప్రజలకు అందాయి.
టీడీపీ నుండి కడప అసెంబ్లీ నుండి మాధవీరెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆమె భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు కారణంగా ఎక్కడైనా చివరినిముషంలో అభ్యర్ధులు మారితే తప్ప దాదాపు టీడీపీ తరపున వీళ్లు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ తరపున అభ్యర్థులను పరిశీలిస్తే కమలాపురంలో రవీంధ్రనాద్ రెడ్డి, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి, మైదకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. డాక్టర్ సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీనే డైరెక్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.