ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్. ప్రతీ గడపకు పాలన అందేలా, దళారి వ్యవస్థ ఉండకుండా జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. సంక్షేమాల అమలులో యువత ప్రాధాన్యం కీలకమని భావించిన జగన్..వారినే వాలంటీర్లుగా ఎంపిక చేశారు.
ప్రతీ వాలంటీర్ తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి వినతులు తీసుకోవడం, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషిచేసేలా వాలంటీర్ వ్యవస్థను రూపుదిద్దారు. అవ్వ,తాతాలకు ఇంటి వద్దకే పెన్షన్ అందించడం, లబ్దిదారులను గుర్తించడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేలా వాలంటీర్ల వ్యవస్థ పనిచేసింది.
అయితే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు ఆ తర్వాత విమర్శలు రావడంతో ఓట్ల కోసం జీతం పెంచి మరీ వాలంటీర్లని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. కానీ గెలిచిన 3 వారాల్లోనే తన కపట బుద్ధిని బయటపెట్టారు. జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడటం ఖాయమనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబును నమ్మి నిండా మోసపోయామని పలువురు వాలంటీర్లు మండిపడుతున్నారు.
