దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. విజయ్ కెరీర్లో చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విజయం వెనుక ఓ నటి మాత్రం తీవ్ర ఆవేదనను ఎదుర్కొంటోంది. ఈ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలన్నీ పూర్తిగా తొలగించారంటూ నటి ఆనంది అజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాలో విడుదల చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
‘జన నాయగన్’ సినిమా కోసం తాను దాదాపు ఏడాది పాటు ఎంతో కష్టపడ్డానని ఆనంది ఆ వీడియోలో తెలిపారు. విజయ్తో కలిసి పనిచేసే అరుదైన అవకాశం దక్కడంతో తాను ఎంతో సంతోషించానని, ఆయన చివరి చిత్రంలో భాగమవ్వడం తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. కానీ, థియేటర్లలో సినిమా చూశాక తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తిగా కట్ చేశారని తెలిసి తాను షాక్ గురయ్యానని తెలిపారు. తన కష్టాన్ని గుర్తించకుండా ఇలా సీన్లు తొలగించడం తనను ఎంతగానో బాధించిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, టెలివిజన్, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు ఆనంది అజయ్కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆనంది, అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్గా, యోగా ట్రైనర్గానూ సుపరిచితమే. అంతేకాకుండా ‘డాన్స్ జోడి డాన్స్ 3.0’, ‘జోడి నంబర్ 1’ వంటి ప్రముఖ రియాలిటీ షోల ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు పరంగా పలు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. సెన్సార్ నిబంధనల ప్రకారం చిత్రంలో దాదాపు 12 కీలక మార్పులు, కోతలు విధించాలని బోర్డు సూచించింది. సెన్సార్ కట్స్ మరియు రన్టైమ్ సమస్యల కారణంగానే ఎడిటింగ్లో భాగంగా ఆమె సన్నివేశాలను కూడా తొలగించి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, జులై 23న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించగా, దేశవ్యాప్తంగా సుమారు రూ.41 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమా సక్సెస్ సాధించినప్పటికీ, తన పాత్ర తొలగింపుతో ఆనంది పడుతున్న ఆవేదన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
