బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమిలే తనకు స్పూర్తి అని వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్-19 జట్టు సభ్యుడు నాగర్ కోటి తెలిపాడు. ఇటీవల న్యూజిలాండ్లో ముగిసిన అండర్-19 ప్రపంచకప్లో 9 వికెట్లు పడగొట్టిన ఈ యువ బౌలర్ భారత జట్టు.. కప్ గెలవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంతిని గంటకి 149కిమీ వేగంతో విసిరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ, తనకు వేగంగా బంతులేయడమే లక్ష్యం కాదని చెప్పాడు. సందర్భానికి తగినట్టుగా బంతులేసి, జట్టు విజయంలో భాగమవ్వాలని కోరుకుంటానని అన్నాడు.
తాను బౌలింగ్ వేసే సమయంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమిని దృష్టిలో ఉంచుకుంటానని చెప్పాడు. వారిని నిశితంగా గమనిస్తానని అన్నాడు. చిత్రం ఏంటంటే తానిప్పటి వరకు వారిని కలిసిందే లేదని అన్నాడు. భవిష్యత్ లో వారిని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్ లో బాగా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
ఇక బౌలింగ్ వేగం అంటారా..? గంటకి 160 కి.మీ వేగంతో బంతులు విసిరినా.. లైన్ అండ్ లెంగ్త్లో విసరలేకపోతే ఫలితం ఉండదు. అందుకే నా వరకు 150కిమీ వేగంతో లయబద్ధంగా బౌలింగ్ చేయాలని ఆశిస్తున్నా’ అని నాగర్కోటి వివరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో నాగర్కోటిని రూ. 3.2కోట్లకి కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలసిందే.
