ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు భారత్కు అదిరే ఆరంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌటయ్యాడు.
ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జానీ బారిస్టో (70: 88 బంతుల్లో 9×4) బంతిని లెగ్ గల్లీ దిశగా నెట్టాడు. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో జోరూట్ (80: 156 బంతుల్లో 9×4)తో కలిసి ఒక పరుగు పూర్తి చేసిన బారిస్టో రెండో పరుగు కోసం అతడ్ని పిలిచాడు. అయితే.. అప్పటికే విరాట్ కోహ్లి బంతిని సమీపిస్తుండటంతో తొలుత తటపటాయించిన జో రూట్ ఆ తర్వాత ఓకే చెప్పి పరుగెత్తాడు.
కానీ.. వేగంగా బంతిని సమీపించిన కోహ్లి.. నియంత్రణ కోల్పోయి తాను పడిపోతున్నా.. గురిచూసి నాన్స్ట్రైక్ ఎండ్లోని వికెట్లపైకి బంతిని విసిరాడు. అక్కడే ఉన్న బౌలర్ అశ్విన్ తొలుత బంతిని అందుకునేందుకు ప్రయత్నించినా.. అది నేరుగా వికెట్ల వైపు వెళ్తుండటాన్ని గమనించి.. ఆఖరి క్షణంలో చేతులను వెనక్కి తీశాడు. దీంతో.. వేగంగా వెళ్లిన బంతి వికెట్లను గీరాటేయగా.. క్రీజులోకి వచ్చేందుకు జో రూట్ డైవ్ చేసినా లాభం లేకపోయింది.
తొలి సెషన్ నుంచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన జో రూట్ పేలవ రీతిలో రనౌటవడం.. అదీ తాను రనౌట్ చేయడంతో.. కోహ్లి మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్కి వెళ్తున్న జో రూట్ వైపు చూస్తూ సంతోషంగా ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు.