వైఎస్ జగన్ తిరుపతిలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’లో బాబుపై మరో సారి విమర్శల వర్షం కురిపించారు. ఎల్లో మీడియా గురించి చెప్పనక్కర్లేదని, ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు వేయిస్తారని, 59 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. త్వరలో జరిగే ఎన్నికలు బాబు ఒక్కరితో కాదని న్యాయానికి, అన్యాయానికి, ఆప్యాయతకు డబ్బుకు మధ్య జరిగేవిగా అభివర్ణించారు.
ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు.. రానున్న ఎన్నికలు ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలు. 2014లో చంద్రబాబు మొదటి సినిమా చూపించారన్నారు. ఇప్పుడు రెండో సినిమా చూపించడానికి సిద్దమయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రైతులకు ఆర్థిక సాయమంటూ డ్రామాలాడుతున్నారని, వారి జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు మూడు నెలల్లో ఉండటంతో చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని, పెన్షన్ ను రెండు వేల రూపాయలకు పెంచారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవ్వా, తాతాలకు రూ.3000 ఫించన్ ఇస్తామని జగన్ ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరితోనే పోటీ కాదని, ఎల్లో మీడియా, అన్యాయం, మోసాలతో కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, మార్చిలో ఎన్నికలు ఉంటాయని, ఈ రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలున బాధ్యత తీసుకోవాలని, చంద్రబాబు ప్రలోభాలకు లోనుకాకుండా చూడాలని అన్నారు.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. ఆయనొస్తున్నాడు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కారన్నారు.
