భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్నికల ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే నాకు తెలుసనని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్లోనూ వైరల్ అయ్యాయి. కడప జిల్లా పర్యటన సందర్భంగా.. ‘రెండేళ్ల క్రితమే ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు చెప్పారు. మన దేశంలో ఎలాంటి వాతావరణం ఉందో మీకు తెలుసు’ అని పవన్ తెలిపారు. ఈ విషయం కాస్తా తెలుగు నుంచి జాతీయ మీడియాకు వెళ్లగా, తాజాగా పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ వెబ్ సైట్ పవన్ కల్యాణ్ మాటలను యథాతథంగా ప్రచురించింది. భారత్ కు చెందిన ఓ అంగ్ల పత్రిక కథనం లింక్ ను దీనికి జతచేసింది.
అంతేగాక పవన్ కల్యాణ్కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది. బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ పేర్కొన్నట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ ద్వారా పవన్ కామెంట్లపై మండిపడుతున్నారు.
