ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత ధనవంతుడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. జగన్ తండ్రి, తాత అంతా సంపన్నులే. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కూడా పనిచేశారు.స్థిరాస్తులు కాకుండా వైయస్ జగన్ కు అనేక వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ఎన్నో వ్యాపారాలు నిర్వహించే వారు. పవర్ ప్రాజెక్టులు, మీడియా రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు.
ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా సంపన్నుల జాబితాను విడుదల చేసింది ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్). సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల ఆస్తులతో మెుదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు రూ.130 కోట్లుగా స్పష్టం చేసింది. ఇకపోతే ఆ తర్వాతి స్థానంలో మరోమంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. గౌతంరెడ్డి ఆస్తులు రూ.61 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. జగన్ ఇటీవల ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు.
ఇకపోతే కేసుల విషయానికి వస్తే వైయస్ జగన్ మంత్రివర్గంలో 17 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 65శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 9 మందిపై తీవ్ర మైన నారోపనలు ఉన్నాయి. వీరంతా తమ మీద పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు..తమ మీద రిజిస్టర్ అయిన కేసులతో పాటుగా నమోదైన అభియోగాల గురించి తమ ఎన్నికల అఫిడవిట్ల సమయంలో వివరించారు.
ఈ జాబితాలో ఎవరు ఉన్నారనే అంశం మీద మాత్రం పేర్లు బయట పెట్టలేదు. ఇక, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి పైన గతంలో టీడీపీ హాయంలో నమోదు అయిన కేసులూ ఉన్నాయి. అయితే వారిపై ఎటువంటి కేసులు ఉన్నాయనే అంశం మీద ఇప్పుడు చర్చ మొదలైంది. సంస్థ సంఖ్య మినహా మంత్రుల పేర్లు వెల్లడించలేదు. దీంతో..ప్రస్తుతం వారు ఎవరనే చర్చ ఆసక్తి కరంగా మారింది.